11న పోలీస్ అకాడమీ పరేడ్ కు అమిత్ షా!  

11న పోలీస్ అకాడమీ పరేడ్ కు అమిత్ షా!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఫిబ్రవరి 11న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేయనున్న పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు. కాగా, ఈ నెల 11న నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 74 ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరుగనుంది.ఈ బ్యాచ్ లో 195 మంది ప్రొబేషనర్లు శిక్షణ పొందారు.11న పోలీస్ అకాడమీ పరేడ్ కు అమిత్ షా!  ఈ పరేడ్ కు కేరళ కేడర్ కు చెందిన శెహన్ షా నేతృత్వం వహించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 8 సంవత్సరాల శిక్షణ పొందిన శెహన్ షా, జాతీయ , రాష్ట్ర స్థాయిలో పలు మెడల్స్ గెలుచుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేసిన ఆయన సీఐఎస్ఎఫ్, ఐఆర్పీఎఫ్ లలో సైతం బాధ్యతలు నిర్వర్తించారు.

కోవిడ్ తర్వాత పూర్తిస్థాయిలో జరుగనున్న పాసింగ్ అవుట్ పరేడ్ ఇదేనని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. ఈ ఏడాదితో ఎన్పీఏ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. 74వ బ్యాచ్ లో 195 మంది ట్రైనీ ఐపీఎస్ లు శిక్షణ పొందారన్నారు. వీరిలో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీ శిక్షణార్థులున్నారు. 37 మంది మహిళా ఐపీఎస్ లు ఉన్నట్లు తెలిపారు. వీరంతా 46 వారాల పాటు కఠోర శిక్షణ పొందినట్లు ఏఎస్ రాజన్ తెలిపారు.

ఈ నెల 11న జరిగే పాసింగ్ అవుట్ పరేడ్ తో 46 వారాల శిక్షణ పూర్తవుతుందని ఏఎస్ రాజన్ తెలిపారు. ఈ సారి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఇండోర్, ఔట్ డోర్ సబ్జెక్టులు కలిపి 17 అంశాలపై శిక్షణ పొందారు. వీరిని ఆ తర్వాత ఢిల్లీకి పంపిస్తారు. అక్కడ మరికొన్ని వారాల శిక్షణ పొందిన తర్వాత వాళ్లకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్తారు. అక్కడి నుంచి వాళ్లను నియమించిన జిల్లాలలోకి వెళ్తారు. విధి నిర్వహణలో ఐపీఎస్ లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకు మెంటర్స్ ఉంటారని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు.