హైదరాబాద్ నలుదిశలా ఐటీ విస్తరిస్తాం: కేటీఆర్

హైదరాబాద్ నలుదిశలా ఐటీ విస్తరిస్తాం: కేటీఆర్వరంగల్ టైమ్స్,హైదరాబాద్: హైదరాబాద్ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్ లో లక్షమంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తైతే లక్ష లక్ష్యానికి సమీపిస్తామన్నారు. ఉప్పల్ లో జెన్ ప్యాక్ట్ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జెన్ ప్యాక్ట్ సంస్థకు వారు శుభాకాంక్షలు తెలిపారు. జెన్ ప్యాక్ట్ ను వరంగల్ లోనూ విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ హైదరాబాద్ కు ధీటుగా తూర్పు హైదరాబాద్ ఎదుగుతున్నదని తెలిపారు.

తూర్పు ప్రాంత అభివృద్ధి కోసం నాగోలులో శిల్పారామం ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నదని చెప్పారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కైవే నిర్మాణం జరుగుతున్నదని, ఉప్పల్ కూడలిలో స్కై వాక్ నిర్మాణం కూడా కొనసాగుతున్నదని చెప్పారు. ఇక్కడ ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతునిస్తుందని పేర్కొన్నారు.