ఏపీ సీఎం ఢిల్లీ టూర్ సక్సెస్..ఎందుకో తెలుసా?

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ సక్సెస్..ఎందుకో తెలుసా?న్యూఢిల్లీ : ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు రూ.320 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021-2022 బడ్జెట్ లో కేంద్ర జల ఇంధన మంత్రిత్వశాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి ఈ నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నిధులు నేడు పీపీఏ ఖాతాలోకి, శుక్రవారం రాష్ట్ర ఖజానాకు చేరుతాయని అధికారులుపేర్కొన్నారు.

అయితే పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరుతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ సక్సెసైనట్లు కనిపిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన రెండ్రోజుల్లోనే పోలవరంకు నిధులు మంజూరయ్యాయి. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 ఏప్రిల్ 1న కేంద్ర జల ఇంధన మంత్రిత్వశాఖ 100 శాతం ఖర్చును తిరిగి చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేయడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటి వరకు రూ.18,372.14 కోట్లు ఖర్చు చేసింది. వీటిలో రూ.13,641.43 కోట్లు ఏప్రిల్ 1, 2014 తర్వాత ఖర్చు చేశారు. కేంద్రం ఇప్పటివరకు రూ. 11,492.16 కోట్లు తిరిగి చెల్లించగా, రూ.2,149.27 కోట్లు బకాయి పడింది. బకాయి పడిన బిల్లులను పరిశీలిస్తున్న పీపీఏ రూ.711.60 కోట్లు రీయంబర్స్ మెంట్ కోసం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపింది.

కేంద్ర జల సంఘం ( సీడబ్ల్యూసీ) ఆమోదంతో ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ , కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో రూ.320 కోట్లను ఆర్థిక శాఖ మొదటి దశలో మంజూరు చేసింది. మిగిలిన మొత్తాన్ని మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా మంజూరు చేసిన నిధులతో రాష్ట్రం చేసిన ఖర్చులో కేంద్రం ఇంకా రూ. 1829.27 కోట్లు బకాయి పడింది.