పోలీసుల వైఖరిపై పి.అశోక్ బాబు ఫైర్ 

పోలీసుల వైఖరిపై పి.అశోక్ బాబు ఫైర్

పోలీసుల వైఖరిపై పి.అశోక్ బాబు ఫైర్ వరంగల్ టైమ్స్, తూర్పుగోదావరి జిల్లా: ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసులు అడ్డుకోవడాన్ని టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యనిర్వాహణ కార్యదర్శి, ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు తీవ్రంగా ఖండించారు. పోలీసులే ఉన్మాదుల్లా వ్యవహరిండం అప్రజాస్వామికమని అన్నారు.ఈ ఘటనపై డీజీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో అశోక్ బాబు పోలీసుల తీరును దుయ్యబట్టారు. చంద్రబాబు కాన్వాయ్ అనపర్తి వెళ్లకుండా రోడ్డుపై అడ్డంగా కూర్చొని పోలీసులే అడ్డుకోవడం వింతగా ఉందన్నారు. గతంలో ఇటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయి అధికారపార్టీకి ఊడిగిం చేస్తుందో చెప్పేందుకు ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణకు అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం కోసం ఎన్నికల కోడ్ ను సాకుగా చూపిస్తున్న పోలీసులకు, రోడ్డుపై బైఠాయించి కాన్వాయ్ ని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఎక్కడా లేని ఆంక్షలు ఇక్కడే ఎందుకని ప్రశ్నించారు. గత రెండు రోజులుగా చంద్రబాబు నిర్వహించిన సభలకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో భయపడిన తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు, నేటి అనపర్తి సభను బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖకు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా అశోక్ బాబు హెచ్చరించారు.