భక్తుల ఇంటికే భద్రాద్రి కల్యాణ తలంబ్రాలు
-రూ.151 చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలంబ్రాలు పొందే సదావకాశం
-ఈ నెల 23 నుంచి బుకింగ్స్ ప్రారంభం
-గోడ పత్రికను ఆవిష్కరించిన వీసీ & ఎండీ నాగిరెడ్డి
వరంగల్ టైమ్స్, భద్రాద్రి:శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం నిర్ణయించింది.శ్రీ రామనవమి సందర్భంగా మార్చి 27, 2026న జరిగే వేడుకలను దృష్టిలో ఉంచుకుని, వివిధ కారణాల వల్ల భద్రాచలం కు వెళ్లలేని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.
ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాల ప్యాకెట్లు పొందాలనుకునే భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్ సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది.
హైదరాబాద్ లోని బస్ భవన్ లో శనివారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను టీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. “నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు.విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని మూడేళ్ళ క్రితమే టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత మూడేళ్ళలో లక్షలాది మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసిందని టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి, ఐపీఎస్ గారు అన్నారు.
భద్రాద్రిలో మార్చి 27న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని నాగిరెడ్డి గారు తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440069లలో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ సీటీఎం(మార్కెటింగ్ & కమర్షియల్) శ్రీధర్, లాజిస్టిక్ ఏటిఏం రాజన్, భాను తదితరులు పాల్గొన్నారు.













