బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే – రాహుల్ గాంధీ

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే – రాహుల్ గాంధీ

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే - రాహుల్ గాంధీ

వరంగల్ టైమ్స్, సంగారెడ్డి జిల్లా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సంగారెడ్డిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ దయతోనే కేసీఆర్‌కు పాలించే అవకాశం వచ్చిందన్నారు రాహుల్. అన్ని వర్గాల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు రావడం లేదు. నిన్న నేను యువకులతో ముచ్చటించాను అన్నారు. కోచింగుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు పేపర్ లీకులతో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలిస్తున్నారు. తాము అధికారంలో కి వచ్చిన వెంటనే ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

బీఆర్ఎస్ హయాంలో 8లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మోడీపై పోరాటం చేస్తే నాపై 56 కేసులు పెట్టారు. నేను నివాసం ఉంటున్న ఇంటిని లాక్కున్నారని ప్రజలకు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యం ఒక్కటే కాంగ్రెస్‌ను ఓడించడమన్నారు. జగ్గారెడ్డిని గెలిపిస్తున్నారా లేదా అని ప్రజలను అడిగారు. గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ మీ భూములన్నీ గుంజుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పేరుతో పేద రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. మహిళలు గ్యాస్ సిలిండర్ కోసం వేల రూపాయలు వెచ్చిస్తున్నారు.

తాము అధికారంలోకి వస్తే కేవలం రూ.500 వందలకే గ్యాస్ బండ ఇస్తామన్నారు. బస్సుల్లో ప్రయాణించడానికి కూడా వేలల్లో ఖర్చు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక ఎకరం భూమికి రూ. 15వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు తమ అకౌంట్లలో వేసి లబ్ధి చేకూరుస్తామన్నారు. అలాగే వ్యవసాయానికి 24గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. వృద్దుల కోసం చేయూత అనే పథకాన్ని అందిస్తామన్నారు. వితంతువులు, వికలాంగులకు రూ.4000 తమ బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామన్నారు. నిరుద్యోగుల కోసం నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.