బీసీలకు న్యాయం జరుగడం లేదు : మోడీ

బీసీలకు న్యాయం జరుగడం లేదు : మోడీ

– బీఆర్ఎస్, కాంగ్రెస్ పై మోడీ ఫైర్
– డబుల్ ఇంజన్ సర్కార్ తోనే డెవలప్మెంట్
– ధరణి పోర్టల్ స్థానంలో మీ భూమి పోర్టల్ తెస్తాం
– తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాం
– నిర్మల్ బహిరంగ సభలో ప్రధాని మోడీబీసీలకు న్యాయం జరుగడం లేదు : మోడీవరంగల్ టైమ్స్, నిర్మల్ జిల్లా : సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోడీ నిర్మల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. మొదటగా నా తెలంగాణ కుటుంబసభ్యులందరి శుభాభినందనలు అంటూ మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ గడ్డపై పుట్టిన కొమరంభీం, రాంజీగోండు వంటి ఆదివాసీ యోధులకు నా నివాళులు అంటూ తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకర్షించారు. కాంగ్రెస్ సుల్తాన్ పాలన ఐతే, బీఆర్ఎస్ నిజాం పాలన అని విమర్శించారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ సర్కార్ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రేకులు వేసిందన్నారు.

 

తెలంగాణలో పేదలకు ఇళ్లు మోడీ గ్యారెంటీ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో మరింత డెవలప్మెంట్ సాధ్యమవుతుందన్నారు. పదేళ్లుగా రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్మూర్ పసుపుకు జీఐ ట్యాగ్ ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించిందని వెల్లడించారు. నిర్మల్ బొమ్మలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటు కళలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ధరణి పేరుతో తెలంగాణలో భూ మాఫియా నడుస్తోందని ఆరోపించారు.

ధరణి పోర్టల్ ను రద్దు చేసి, మీ భూమి పోర్టల్ ను తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని విమర్శించారు. బీసీల్లో ప్రతిభావంతులకు న్యాయం జరగడం లేదన్నారు ప్రధాని మోడీ. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొందన్నారు. మతం పేరుతో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామనడం దారుణమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకదానికొకటి జిరాక్స్ కాపీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కి ఓటేస్తే అది నేరుగా బీఆర్ఎస్ కి వెళ్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్ఎస్ పక్కన పెట్టిందన్నారు. ఎస్సీ, ఓబీసీలకు కాంగ్రెస్ తీరని లోటు చేసిందని విమర్శించారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందన్న ప్రధాని మోడీ, దీనికి నిదర్శనంగా తెలంగాణలో తొలిసారి బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని హామీ ఇచ్చారు.