అమరావతి: వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రైతులపై భారం వేయడానికి మోటార్లకు మీటర్లు పెడతారా, ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రైతులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఇది. రైతులు సాధించుకున్న హక్కు ఇది. అలాంటి రైతుల హక్కులను దెబ్బతీసే విధంగా మీటర్లు పెడుతూ డబ్బులు ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతారా? ఎక్కడిచ్చారు డబ్బులు? అని నిలదీశారు. “మీరేమైనా మాటమీద నిలబడ్డారా… మీరొక ఫేక్ ముఖ్యమంత్రి. రైతుకు మరణశాసనం ఇది. రైతు మెడకు ఉరేయడమే. డబ్బులు కట్టకపోతే కరెంటు తొలగిస్తారు. ఎక్కడా పన్నులు వేయబోమని ఎన్నికల వేళ చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్ని పన్నులు పెంచారు. నాడు ఎన్నో హామీలు ఇచ్చారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలను కలిపి దాన్ని మీ ఘనతగా చెప్పుకుంటే ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నారా? కేంద్రం చూస్తూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా?” అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.