బెంగుళూరు : బెంగుళూరు సీఐడీ డీఎస్పీ లక్ష్మి (33) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 2014 బ్యాచ్కు చెందిన లక్ష్మి 2017లో ఉద్యోగంలో నియమితులయ్యారు. లక్ష్మి ప్రస్తుతం పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్నేశ్వరి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తన స్నేహితురాలు ఇంటికి విందుకు వెళ్లిన లక్ష్మి అక్కడే గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకు లక్ష్మి బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టడంతో ఉరివేసుకుని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను వెంటనే కిందికి దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఎనిమిది సంవత్సరాల కిందట వివాహం చేసుకున్న లక్ష్మికి సంతానం కలగలేదు. సంతానం కలుగలేదన్న నిరాశతో లక్ష్మి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఆత్మహత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. లక్ష్మిది కోలార్ జిల్లాలోని మలూరు తాలుకా మాస్తి గ్రామం.