సినీ గేయ రచయిత కందికొండ ఇకలేరు

సినీ గేయ రచయిత కందికొండ ఇకలేరు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన సినీ గేయ రచయిత కందికొండ ( 49) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంగళరావు నగర్ లోని తన ఇంట్లో కందికొండ తుదిశ్వాస విడిచారు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కందికొండ ఆస్పత్రి పాలవడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. సినీ గేయ రచయిత కందికొండ ఇకలేరుఅదే సమయంలో కరోనా విజృంభించడంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో కందికొండ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కందికొండకు వైద్యం అందించారు. కొన్ని రోజులు ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, మళ్లీ క్షీణించడంతో శనివారం కందికొండకు తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతి పట్ల చిత్ర పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక మంచి గేయ రచయితను కోల్పోయామని సినీ పరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు.

కందికొండ పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనపై తనకున్న ఆసక్తి కారణంగా క్రమంగా సినీ రంగంవైపు అడుగులు వేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది. దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. అలా ‘ ఇడియట్ లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’ లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్ ఇన్ లవ్’, ‘పోకిరి’లో’ గల గల పారుతున్న గోదారిలా’ , ‘జగడమే’, ‘లవ్ లీ’లో ‘లవ్ లీ లవ్ లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు.