21న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం

21న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మార్చి 21న ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 21న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంరాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్ఛితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సమావేశం అనంతరం సీఎం, మంత్రుల బృందం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్ సీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాన రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.