‘ఆర్ఆర్ఆర్’టీం ను ప్రశంసించిన సీఎం కేసీఆర్

‘ఆర్ఆర్ఆర్’టీం ను ప్రశంసించిన సీఎం కేసీఆర్

'ఆర్ఆర్ఆర్'టీం ను ప్రశంసించిన సీఎం కేసీఆర్వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందు పరిచిన పదాలు, తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని కేసీఆర్ అన్నారు.

తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కి, కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాణ విలువల పరంగాను, సాంకేతికంగాను హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రాలు రూపొందుతుండటం గొప్ప విషయమని సీఎం అన్నారు. ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని సీఎం పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లకే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండుగ రోజని, తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు.

తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు. కరోనా కాలంలో కష్టాలు చుట్టిముట్టిన తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని, వైవిద్యంతో కూడిన కథలతో, ప్రజా జీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.