ఈనెల 31 నుంచి కాంగ్రెస్ పోరుబాట 

ఈనెల 31 నుంచి కాంగ్రెస్ పోరుబాట

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి-ముక్త్ భారత్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల పోరాటానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ధరల పెరుగుదలకు నిరసనగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించనుంది. తొలి దశ పోరులో మార్చి 31ని గ్యాస్ సిలిండర్ హహీది దివస్ గా పాటించాలని నిర్ణయించింది. మార్చి 31 ఉదయం ధరల పెంపునకు నిరసనగా డప్పులు మోగించి, గంట కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.ఈనెల 31 నుంచి కాంగ్రెస్ పోరుబాట ఈ నెలలో గ్యాస్ సిలిండర్ ధరను సిలిండర్ కు రూ. 50 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఎల్ పీజీ సిలిండర్ ధర పెంపునకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు సిలిండర్లకు దండలు వేసి ఊరేగిస్తారని, ధరల మంటపై ప్రజలను చైతన్యపరుస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సింగ్ సుర్జీవాలా తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 4 వరకు పార్టీ సారథ్యంలో జిల్లా, బ్లాక్ స్థాయిలో ధర్నాలు ప్రదర్శనలు చేపడతామని చెప్పారు. ఏప్రిల్ 7న రాష్ట్ర రాజధానుల్లో కాంగ్రెస్ శ్రేణులు, ఎన్జీవోలు, ప్రజలు, సామాజిక సంస్థలతో కలిసి ప్రదర్శనలు జరుగుతాయని సుర్జీవాలా పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కార్ సామాన్యులపై పెను భారం మోపిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.