‘దొరకునా ఇటువంటి సేవ’ మూవీ పోస్టర్

'దొరకునా ఇటువంటి సేవ' మూవీ పోస్టర్

హైదరాబాద్​: ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. అదే ‘దొరకునా ఇటువంటి సేవ’ ఈ పోస్టర్‌లో నటీనటులు ఎవరూ లేరు. ‘దొరకునా ఇటువంటి సేవ’ అని టైటిల్ ఉంది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ‘శంకరాభరణం’లో ‘దొరకునా ఇటువంటి సేవ’ పాట ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. ఆ పాటలోని మొదటి లైన్ తీసుకుని టైటిల్ పెట్టడం వల్ల ప్రేక్షకుల దృష్టిని కొంచెం ఆకర్షించారు. టైటిల్ కోసమే వైరల్ అవుతుందా? అంటే… కాదని చెప్పాలి. టైటిల్ మీద ‘ఇన్‌క్రెడిబుల్ రివేంజ్ ఇన్ దిస్’ అని క్యాప్షన్‌లో అక్షరాలను పెద్దగా డిజైన్ చేయించడం. ముఖ్యంగా ‘I’లో అమ్మాయి షాడో… ముగ్గురు పురుషుల చూపుడు వేలును ఓ అమ్మాయి పట్టుకొని ఉండటం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి పోస్టర్ వైరల్ అయింది. దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా ‘దొరకునా ఇటువంటి సేవ’ ‘ఇన్‌క్రెడిబుల్ రివేంజ్ ఇన్ దిస్’… అనేది ఉపశీర్షిక. ఇటీవల నటుడు టీఎన్ఆర్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.  “సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ ఫైనల్ దశలో ఉంది. జనవరిలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం. టీజర్ విడుదలయ్యే వరకూ నటీనటులు ఎవరనేది సస్పెన్స్. కొత్త నటీనటులతో చేశామా? పాత నటీనటులతో చేశామా? అనేది టీజర్ చూసి తెలుసుకోవాలి.” అని అన్నారు చిత్ర నిర్మాత దేవ్​ మహేశ్వరం.”వివాహేతర సంబంధాలకు సంబంధించిన కథతో సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా సినిమాను రూపొందించాం. వివాహేతర సంబంధాల నేపథ్యంలో కథను ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఏంటంటే… ఇటీవల ఓ డేటింగ్ యాప్ చేసిన సర్వేలో ప్రతి పదిమందిలో ఏడుగురు వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఆ ఏడుగురిలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ శాతం ఉన్నారనే విషయం తెలిసి షాకయ్యా. మరో సర్వేలో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల్లో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలు మొదటి స్థానంలో ఉన్నాయని తేలింది. ‘ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా భర్తకు దొరికిన భార్య… వాళ్ళిద్దరినీ చంపిన భర్త’, ‘ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య’ వంటి ఘటనలు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. క్షణికానందం కోసం జీవిత భాగస్వాములను హత మార్చడానికి సైతం కొందరు వెనుకాడటం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరిగినట్టు వార్తల్లో ప్రజలు చూస్తున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న మనుషుల వల్ల ఎటువంటి సంబంధం లేని వాళ్లు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అనే అంశంతో మూడు కథల సంకలనం (యాంథాలజీ)గా నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందించాం” అని దర్శకుడు రామచంద్ర రాగిపిండి చెప్పారు. ఈ చిత్రానికి పీఆర్వో నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటింగ్ ఛోటా కే ప్రసాద్, కెమెరా రామ్ పండగల, మ్యూజిక్ సాయి కార్తీక్, నిర్మాత దేవ్ మహేశ్వరం, రచన-దర్శకత్వం రామచంద్ర రాగిపిండి.