హామీలు విస్మరిస్తే..ఇక కౌంట్ డౌనే : కేటీఆర్

హామీలు విస్మరిస్తే..ఇక కౌంట్ డౌనే : కేటీఆర్ హామీలు విస్మరిస్తే..ఇక కౌంట్ డౌనే : కేటీఆర్

– గ్యారంటీలను గాలికొదిలేస్తే కాంగ్రెస్ ను వదిలిపెట్టం
– కుంటిసాకులతో పథకాలను పాతరేస్తే ఊరుకోం
– ప్రతి ప్రగతి నివేదిక..ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం
– అప్పుల సాకు చెప్పి తప్పుకోవడమే కాంగ్రెస్ ప్లాన్
– ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం
– కాంగ్రెస్ పై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనమీద దూకుడు పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పాలనను విమర్శిస్తూ, అభివృద్ధిపై ఆరోపణలు చేస్తూ ఓ వైపు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను దండుకుంది. అలాగే కేసీఆర్ ఉచిత పథకాల వల్ల ప్రజలకు లాభం ఏం లేదంటూనే , రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసిన విషయం, చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటితో పాటు ప్రజలు ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే వాటిని అమలుపరుస్తానని ఢంకా భజాయించి మరీ చెప్పారు. మరోవైపు బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను త్వరితగతిన అమలు చేయాలని, లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తుంది. ఇదిలా ఉండలా అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వాడీవేడీగా చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రం తాము చేసిన డెవలప్మెంట్ పై ఆధారాలు, రుజువులు చూపిస్తూ మరీ, కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై స్పష్టతను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.హామీలు విస్మరిస్తే..ఇక కౌంట్ డౌనే : కేటీఆర్ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గ్యారంటీలను గాలికొదిలేసి, శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి, అధికారంలోకి రాగానే మభ్యపెడతారా ? కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా? అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా అని మండిపడ్డారు. గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా ? అని ఘాటుగా ప్రశ్నించారు. శ్వేత పత్రాల తమాషాలు, పవర్ పాయింట్ షోలు దేనికోసం ? అని నిలదీశారు. అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే, మొండిచేయి చూపించడానికి తొండి వేషాలా వేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్ల తమ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం అని కేటీఆర్ తెలిపారు. శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా అని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో మేం విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆడిట్ రిపోర్ట్‌ లు, ఆర్బీఐ నివేదికలు ప్రతి పైసాకు లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయి కదా అని గుర్తు చేశారు. ప్రతి రంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు ప్రచురించి, ప్రజల ముందువుంచామని, తాము దాచింది ఏమీలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ శోధించి, సాధించేది ఏమీ వుండదన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి, తప్పించుకోవాలని చూస్తారా ? అని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. అబద్ధాలు, అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదు, నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడమని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి లేనప్పుడు తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం కాంగ్రెస్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు. అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారంటీలను నీరుగార్చాలన్నది అసలు ప్లాన్ అని అన్నారు. అంచనాలు, అవగాహన లేకుండానే అర్రాస్ పాటలు పాడినారా అంటూ కేటీఆర్ కొర్రీలు పెట్టారు. వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే ఈ నాటకాలు అని విమర్శించారు. మీరు ఎన్ని కథలు చెప్పినా, మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే వుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు అడుగుతోంది శ్వేతపత్రాలు కాదు, గాలి మాటల గ్యారెంటీల సంగతి ఏంటని ? కేటీఆర్ నిలదీశారు. కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే, తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమని హెచ్చరించారు. హామీలు అమలు చేయలేకపోతే, అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారంటీ అని కేటీఆర్ జోస్యం చెప్పారు.