రాయలసీమను రతనాల సీమగా మార్చనున్న జగన్

శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమ రతనాలసీమగా ఖ్యాతిగడిచింది. ఆ తర్వాత రానురాను రాయలసీమ అంటే కరువు ప్రాంతం, ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా మారాయి. గత ఐదేళ్లలో తెలంగాణ సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి సాధించింది. బహుళార్థక భారీ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లోనే నిర్మించి తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతోంది. అయితే గత చంద్రబాబు ప్రభుత్వంలో సాగునీటి రంగంలో ఏమాత్రం అభివృద్ధి సాధించకపోవడం శోచనీయంగా మారింది. ఏపీ అభివృద్ధి కేవలం గ్రాఫిక్స్ లకు మాత్రం పరిమితవడంతో కిందటి ఎన్నికల్లో బాబుకు ప్రజలు షాకిచ్చిన సంగతి తెల్సిందే. కానీ ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక ఏపీ అభివృద్ధిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అభివృద్ధి పరుగులు పెడుతోంది. వెనుక బడ్డ ప్రాంతాలకు న్యాయం జరుగుతోంది.

రాయలసీమను రతనాల సీమగా మార్చనున్న జగన్

రాయలసీమలో కొత్త శకం ప్రారంభం..

2019 ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైపీసీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి ఏపీ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను జగన్ సర్కార్ పెద్దపీఠ వేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ మరణంతో ఆగిపోయిన రాయలసీమ అభివృద్ధిని జగన్ భుజాన వేసుకున్నారు. సీమ ప్రజలు నీటి కోసం నింగివైపు చూసే రోజులుపోయేలా ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపడుతున్నారు.

ఆర్.ఎల్.సీ పథకంతో సీమ కష్టాలు దూరం..

రాయలసీమ ప్రాంతంపై పూర్తి అవగాహన కలిగిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సీమను సస్యశ్యామలం చేసేలా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలలో ఒకటైన కాళేశ్వరంకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం(ఆర్.ఎల్.సీ)ను ఏర్పాటు చేయబోతున్నారు. సీమ కరువు తీరేలా శ్రీశైలం జలాలను మళ్లించనున్నారు. రోజుకు 3టీఎంసీల వరకు కృష్ణా నదీ వరద జలాలను మళ్లించే ఈ అద్భుత పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఉమ్మడి ఏపీలో కరువుతో అల్లాడే సీమ జిల్లాలకు నీళ్లందించాలని నాడు డా.వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంతోపాటు హంద్రీ-నీవా, గాలేరు నగర లాంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు తోడ్పడే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపడుతున్నారు. అంతరాష్ట్ర వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిచే దశకు చకచకా చేరుకుంది.

రాయలసీమను రతనాల సీమగా మార్చనున్న జగన్

ఏపీ చరిత్రలోనే అరుదైన ప్రాజెక్ట్ ఇదీ..

రాష్ట్రంలోనే ఇంతపెద్ద ఎత్తపోతల పథకం ఎవరూ  నిర్మించనే లేదు.  ప్రపంచంలోనే పెద్దదైన బహుళ, భారీఎత్తిపోతల పథకం కాళేశ్వరం రెండు టీఎంసీల పంపింగ్ సామర్థ్యంతో తెలంగాణలో మాత్రమే నిర్మించారు. ఇప్పుడు మరో టీఎంసీ సామర్థ్యం విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న రాయలసీమ పథకం కూడా అంతే సామర్థ్యంతో నిర్మిస్తుండటం విశేషం. రోజుకు మూడు టీఎంసీల నీటిని పంపింగ్ చేసేలా తీర్చిదిద్దారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంత పెద్ద పంపింగ్ ప్రాజెక్ట్ నిర్మించనే లేదు. ఏపీలో అతిపెద్దదిగా భావించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం మొత్తం ఏడాది పంపింగ్ సామర్థ్యం 40టీఎంసీలు మాత్రమే. అలాగే పట్టిసీమ, ముచ్చుమర్రి, కొండవీటి వాగు, పురుషోత్తపట్నం లాంటి ఎత్తిపోతల పథకాలు గతంలోనే పూర్తయ్యాయి. వీటితో ఏమాత్రం పోలికలేని విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద నిర్మిస్తున్నారు.

వృథాగా సముద్రంలోకి వరద నీళ్లు

పాలకులు, ప్రభుత్వాలు ఎన్నిమారిన రాయలసీమ నీటి కష్టాలు తీర్చడంలో విఫలమయ్యాయి. వరదనీటిని సముద్రంపాలవుతున్న సరైన చర్యలు చేపట్టకపోవడంతో రాయలసీమ వాసుల నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం నుంచి రాయలసీమకు తెలుగు గంగ (29 టిఎంసీలు), ఎస్.ఆర్.బి.సి (19), గాలేరు-నగరి-జిఎన్ఎస్ఎస్ (39), చెన్నైకి తాగు నీరు (15), టిబిపిహెచ్ ఎల్ సి (10), తాగు నీటి అవసరాలు- ఆవిరి నష్టాలు (3 టిఎంసీలు) కలిపి మొత్తం 114 టిఎంసీల నీటిని వినియోగించుకోవాలి.  గత సంవత్సరం 179.30 టిఎంసిల నీటిని రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నై నగరాలకు మళ్లించారు. అయినప్పటికీ సీమలో నీటి సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవైపు వరదల సమయంలో నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది.  శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని వినియోగించాల్సి ఉండగా గత రెండు సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన ఏ ఏడాది కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్ట్ లకు మళ్లించలేకపోయారు.

రాయలసీమను రతనాల సీమగా మార్చనున్న జగన్

సీమకు ప్రయోజనం లేని వరదలు

కృష్ణా నదికి భారీ వరదలు వచ్చి శ్రీశైలం పొంగి ప్రవహించి జలాలు సముద్రంలోకి వెళుతుండటంతో రాయలసీమకు ప్రయోజనం లేకుండా పోతుంది. 2019-20 సంవత్సరంలో శ్రీశైలంకు ఆరు విడతల్లో(స్పెల్స్) వరదలు వచ్చాయి. 889 టిఎంసిల నీటిని స్పిల్ వే నుంచి కిందకు విడుదల చేశారు. అందులో 600 టిఎంసిల నీరు నిరుపయోగంగా సముద్రం పాలు అయ్యింది. అదే సమయంలో రాయలసీమలోని 4 జిల్లాలకు అవసరమైన నీరు అందలేదు. 120టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఈ నాలుగు జిల్లాలోనూ ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. వరద నీరు సైతం సీమ జిల్లాలకు అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు జలాశయంలో పూడిక పెరిగిపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయింది. వాస్తవానికి 308టీఎంసీల జలాలు ప్రాజెక్ట్ నిండినప్పుడు ఉండాలి. కానీ 215 టీఎంసీలు మాత్రమే ఉంటోంది. అంటే దాదాపు 93టీఎంసీల నీరు నిల్వ లేకుండా నిరుపయోగం అవుతోంది. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని మళ్లించుకోవడమే ఏకైక శరణ్యమని సీఎం జగన్మోహన్ రెడ్డి తలంచారు. దాంతో ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనం చేసి ఆచరణలో సాధ్యమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

397మెగావాట్ల భారీ పంపింగ్ కేంద్రం..

రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్.ఎల్.సీ-రాయలసీమ లిప్ట్ స్కీమ్) ద్వారా రోజు మూడు టీఎంసీల(34722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణానది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి క‌ృష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. జలాశయంలో 800 నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు మళ్లించే విధంగా నీటిని పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణానదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8 టిఎంసీల వరకు కూడా పంప్ చేసేందుకు ఉపయోగపడే విధంగా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది జగన్ ప్రభుత్వ ఉద్దేశం.

ఆర్.ఎల్.సీ కోసం 12వేల ఎకరాల భూమి సేకరణ..

ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తో పాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5 కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12 మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యుమెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసే విధంగా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి. మొత్తం 397మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరమవుతుంది. ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ ను వినియోగించి ఒక కేంద్రం నుంచి నీటిని పంపింగ్ చేయడం రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా లేదు. ఏపిలో ఇదే అరుదైనది.. పెద్దది అవుతుంది. ఈ పంప్ హౌస్ పనిచేయాలంటే కనీస నీటిమట్టం 243 అడుగులు ఉండాలి. డెలివరీ లెవల్ 273 అడుగుల వద్ద ఉంటుంది.  ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముఖ్యంగా కొత్తకాలువ తవ్వడానికి 12వేల ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు.

ఆర్.ఎల్.సీ పూర్తయితే ఇక రాయలసీమ వాసులు నీళ్లకోసం నింగివైపు చూపే రోజులు పోవడం ఖాయం. తన హయాంలోనే ఈ నిర్మాణం పూర్తిచేసి రాయలసీమ వాసులకు చిరకాలం గుర్తుండే కానుకను సీఎం జగన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.