లోకేష్ పాదయాత్రలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

లోకేష్ పాదయాత్రలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

వరంగల్ టైమ్స్, చిత్తూరు జిల్లా : టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీడీ నెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లిలో ఆయన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. స్టూల్ పైకి ఎక్కి లోకేష్ మాట్లాడుతుండగా ఆ స్టూల్ ను పోలీసులు లాగేసే ప్రయత్నం చేశారు. మైక్ తీసుకొస్తున్న బాషా అనే కార్యకర్త నుంచి మైక్ ను లాక్కున్నారు. దీంతో పోలీసులపై లోకేష్, టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్టూల్ మీదే నిలబడి లోకేష్ నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని చూపిస్తూ పోలీసులపై లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు లోకేష్ పై మరో క్రిమినల్ కేసు నమోదయింది. చిత్తూరు నర్సింగరాయపేట పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 341, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సమావేశాన్ని నిర్వహించారని, పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. లోకేష్, ఇతర నేతలపై పోలీసు అధికారులే ఫిర్యాదు చేయడం గమనార్హం. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పై కేసు నమోదు కావడం ఇది ఐదోసారి. లోకేష్ తో పాటు పులివర్తి నాని, అమరనాథ రెడ్డి, దొరబాబు, చంద్రదండు ప్రకాశ్ లపై కేసులు నమోదు చేశారు.