మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో చుక్కెదురు 

మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో చుక్కెదురు

మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో చుక్కెదురు వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి హైకోర్టులో చుక్కెదురైంది. జూబ్లీహిల్స్ సొసైటీలో వివాదాస్పదమైన 595 చదరపు గజాల స్థలం విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది. ఆ స్థలంలో నిర్మాణాలు చేయరాదని చెప్పింది. పార్కు, ప్రజావసరాల కోసం జీహెచ్ఎంసీకి జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలాన్ని అప్పగించింది. అదే 595 చదరపు గజాలను చిరంజీవికి కేటాయించడాన్ని తప్పుపడుతూ కె.శ్రీకాంత్ బాబు సహా ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి మంగళవారం విచారణ జరిపారు.

595 చదరపు గజాల అమ్మకాలకు సంబంధించిన సొసైటీ మేనేజింగ్ కమిటీ, వార్షిక సర్వసభ్య సమావేశం ఆమోదం చెప్పిన రికార్డులను తెప్పించుకుని పరిశీలించాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. ప్రజావసరాల కోసం నిర్దేశించిన స్థలాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోలేదన్నారు. అదే స్థలాన్ని చిరంజీవికి విక్రయించారని చెప్పారు. వాదనల తర్వాత స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.