తెలంగాణలో మే 21 వరకు వర్షాలు  

తెలంగాణలో మే 21 వరకు వర్షాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఈనెల 21 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు రెండ్రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నది.

ఉత్తర-దక్షిణ ద్రోణి, పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందన్నారు. దీంతో రాగల 24 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.తెలంగాణలో మే 21 వరకు వర్షాలు  తగ్గుతున్న ఎండివేడి
వాతావరణంలో వస్తున్న మార్పులతో పాటు నైరుతి రుతుపవనాలు ఆగమనం మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. అత్యంత ఎక్కువగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 42.8, కొత్తగట్టులో 42.7, ఆదిలాబాద్ జిల్లా భోరజ్ లో 42.6, ఆదిలాబాద్ 42.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా మెదక్ జిల్లా కల్లకల్ లో 23.8 డిగ్రీలు నమోదైంది. గడిచిన 24 గంటల్లో అధికంగా ములుగు జిల్లా ఏటూరునాగారంలో 2.56 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. 20 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు, 5 జిల్లాల్లో 39 పైన, మరో 5 జిల్లాల్లో 38 పైన, 3 జిల్లాల్లో 37 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.