టెలి కన్సల్టేషన్ సేవల్లో తెలంగాణకు మూడో స్థానం

టెలి కన్సల్టేషన్ సేవల్లో తెలంగాణకు మూడో స్థానం

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా కేంద్రం అవార్డు
హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు

టెలి కన్సల్టేషన్ సేవల్లో తెలంగాణకు మూడో స్థానం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టెలి కన్సల్టేషన్ సేవల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మూడో స్థానం సాధించింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శనివారం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12 నుండి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన టెలి కన్సల్టేషన్ క్యాంపెయిన్ లో తెలంగాణ సత్తా చాటింది.

దాదాపు రెండు నెలల కాలానికి గాను 17,47,269 కన్సల్టేషన్స్ పూర్తి చేసింది. ఇందులో భాగంగానే కేంద్రం నుండి రాష్ట్రానికి గుర్తింపు లభించింది. మొదటి స్థానంలో తమిళనాడు, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5876 పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానలు, సబ్ సెంటర్ల నుండి టెలి కన్సల్టేషన్ ద్వారా 12 రకాల పైగా స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజలకు అందించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ప్రారంభమైన ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు మొత్తం 27,24,247 మంది టెలి కన్సల్టేషన్ సేవలు పొందారు.

టెలి కన్సల్టేషన్ సేవలో రాష్ట్రానికి మూడో స్థానం లభించడం పట్ల ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్య సిబ్బంది నిరంతరం కృషిని అభినందించారు. ఆరోగ్య రంగంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.