వేగవంతమైన నల్లగొండ సుందరీకరణ

వేగవంతమైన నల్లగొండ సుందరీకరణనల్లగొండ జిల్లా : పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్ పట్టణాభివృద్ధికి నిధుల వర్షం కురిపించారు. చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టాలంటూ ఆయన ఆదేశించిన నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ చివరి వారంలో వరుసగా సీఎం కేసీఆర్, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డిలతో కలిసి పట్టణాబివృద్దిపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించిన విషయం విదితమే.

ఇందులో భాగంగా పట్టణ సుందరీకరణలో భాగంగా అధికారులు ఆఘమేఘాల మీద నివేదికలు రూపొందించి అటు సీఎంకు, ఇటు మంత్రి కేటీఆర్ కు జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ క్రమంలోనే పట్టణాభివృద్ధిలో మొదటి ప్రాధాన్యం డ్ల విస్తరణగా భావించిన ప్రభుత్వం ఏకంగా ఒకేసారి రూ.84 కోట్ల నిధులను విడుదల చేసింది.

అంతే గాకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అభివృద్ధి నిమిత్తం మరో రూ.4 కోట్లు విడుదల చేస్తూ జీఓ లు విడుదల చేశారు. రోడ్ల విస్తరణ నిమిత్తం విడుదలైన రూ.84 కోట్లలో హైదరాబాద్ రోడ్ లో ఉన్న వివేకానంద విగ్రహం మొదలుకొని క్లాక్ టవర్ పెద్దబండ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు రూ.46 కోట్లు, డీఈఓ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రూ.18 కోట్లు, దేవరకొండ రహదారిపై ఉన్న నీలగిరి-నందికొండ కూడలి నుండి కత్తాల్ గూడెం వరకు రూ.15 కోట్లు, కలెక్టర్ కార్యాలయం నుండి కేశరాజు పల్లి వరకు రూ.15 కోట్లతో రోడ్ల విస్తరణ చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు.

అంతేకాకుండా జంక్షన్ ల అభివృద్ధి కొరకు విడుదల చేసిన రూ.4 కోట్ల నిధులతో మర్రిగూడ బై పాస్ రోడ్, యన్ జి కళాశాల, సుభాష్ చంద్రబోస్ విగ్రహం జంక్షన్, డీఈఓ కార్యాలయం కూడళ్లలో అభివృద్ధి చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆఘమేఘాల మీద నల్లగొండ పట్టణ సుందరీ కరణకు నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.