కొండచరియలు విరిగిపడి 14 మంది దుర్మరణం

కొండచరియలు విరిగిపడి 14 మంది దుర్మరణంవరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్: కొలంబియా పశ్చిమప్రాంతంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల దాటికి పెరీరా మున్సిపాలిటీలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న నివాస ప్రాంతాలను బురద ముంచెత్తింది. బురదలో కూరుకుపోయి 14 మంది చనిపోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒకరి ఆచూకీ లభించడం లేదని వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు.

పెరీరా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, మరింత ప్రాణనష్టం జరుగకుండా ఉండేందుకు ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే 60 ఇండ్లను ఖాళీ చేయించారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు.