పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు

వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలకు చర్యలు
జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ప్రకటించి ప్రదర్శిస్తాం
జీవోల సంఖ్య 53,54 మరియు 59లకు అనుగుణంగా బదిలీలు
విద్యార్ధుల నిష్పత్తికి అనుగుణంగా చర్యలు
డిశెంబర్​ 16నుంచి 21 మధ్య ఉపాధ్యాయుల తుది కేటాయింపు
విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలుఅమరావతి : రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను అవకతవలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను వెబ్ కౌన్సెలింగ్ విధానంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు సంబంధించి ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడమని చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ కు ఏవిధంగా వెసులుబాటు ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఒక డెమోను యూట్యూబ్ ఛానల్​లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. దానిని ఉపాధ్యాయులు వినియోగించుకుని ఆ ప్రకారం వెబ్ కౌన్సెలింగ్​కు ఆప్సన్స్ ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. గత నెల 28 వతేదీ నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించామని వివరించారు. నవంబర్​ 30 నుంచి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేశామని దానిపై డిసెంబరు 3నుంచి 7వరకూ డీఈవోలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని తెలిపామని పేర్కొన్నారు. తదుపరి డిశెంబరు 8 నుంచి 10లోగా తుది జాబితాను సిద్ధం చేయాల్సిందిగా డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. డిశెంబర్​ 16నుంచి 21 వరకూ ఉపాధ్యాయుల బదిలీల తుది కేటాయింపు ఉంటుందని మంత్రి వెల్లడించారు. 20 శాతం హెఆచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-1గాను, 14.5శాతం హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-2గాను, 12 శాతం హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-3గాను, 12శాతం కంటే తక్కువ హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-4గాను నాలుగు కేటగిరీలుగా విభజించి ఆప్రకారం బదిలీల ప్రక్రియను చేపట్టనున్నట్టు మంత్రి సూచించారు. అంతేగాక ఉపాధ్యాయుల సర్వీసును బట్టి ఏడాదికి 0.5 వంతున మార్కులు కేటాయించి ఆసర్వీసు మార్కుల ఆధారంగా బదిలీల ప్రక్రియలో ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు తెలిపారు. గిరిజన మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో కూడా విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా కనీసం ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల పాఠశాలలకు ఉపాధ్యాయ ఖాళీలను సర్దుబాటు చేసి బదిలీలను చేపడుతామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు లక్షా 72 వేల వరకూ మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఉండగా వాటిలో 15వేల పోస్టులను బ్లాకు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విధంగా బ్లాకు చేసిన పోస్టులను బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక మారుమూల,గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యతను ఇస్తూ రెగ్యులర్ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీచేయడం చేస్తామని ఇది నిరంతర ప్రక్రియను స్పష్టం చేశారు. విద్యావిధానంలో అటు విద్యార్ధుల తల్లితండ్రులు, ఇటు ఉపాధ్యాయులను పూర్తిగా భాగస్వాములను చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్​ పేర్కొన్నారు.