గ్రేటర్ హైదరబాద్ పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

గ్రేటర్ హైదరబాద్ పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌: బల్దియా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్‌ ఒకటిన జరిగే పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు గ్రేటర్‌ పోలింగ్‌ జరుగనుంది .కరోనా నేపథ్యంలో ఈసారి బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 150 డివిజన్లలో 9101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నిక బరిలో ఉన్న 1122 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. ఇందులో అత్యధికంగా జంగంమెట్‌ డివిజన్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉప్పల్‌, బార్కస్‌, జీడిమెట్ల, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలీచౌకి డివిజన్లలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

రేపు జరిగే గ్రేటర్‌ పోలింగ్‌లో మొత్తం 74,44,260 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 676 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఇందులో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో అత్యధికంగా 79,290 మంది ఓటర్లు, రామచంద్రాపురం డివిజన్‌లో అత్యల్పంగా 27,998 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కోసం 48 వేల మంది సిబ్బందిని వినయోగించనున్నారు. 14 మంది సాధారణ పరిశీలకులు, 38 మంది వ్యయపరిశీలకులు, 60 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 30 సర్వెలెన్స్‌ బృందాలు, మొత్తం 30 డీఆర్‌సీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. డీఆర్‌సీ కేంద్రాల్లో ఇవాళ పోలింగ్‌ సామాగ్రి పపింణీ చేయనున్నారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద కరోనా మార్గదర్శకాలు పాటించాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీచేసింది. ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని ఎస్‌ఈసీ సూచించింది. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించింది. కరోనా బాధితులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగదించేకునే అవకాశం కల్పించింది. దీంతో మొత్తం 2831 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. కరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఓటేసేందుకు అనుమతివ్వనున్నారు.

ఉదయం 5.30 గంటలకు ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్‌ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అథారిటీ, కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ ఆదేశించారు. ఆరు గంటలకు పోలింగ్‌ ఏజెంట్లు హాజరు కావాలని ఆయన కోరారు. ఉదయం 6 నుంచి 6.15వరకు మాక్‌ పోలింగ్‌ ఉంటుందన్నారు. ఉదయం 6.55కి బ్యాలెట్‌ బాక్స్‌లను సీజ్‌చేసి ఏడు గంటలకు పోలింగ్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్‌ పూర్తవుతుంది. కోవిడ్‌-19 పాజిటివ్‌ ఉండి పోస్టల్‌ బ్యాలెట్‌ పొందలేనివారికి ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా ఓటువేసే అవకాశం కల్పించనున్నారు. ఆరు గంటలలోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నవారికి ఓటువేసే అవకాశం కల్పిస్తారు. ఓటరు గుర్తింపు కార్డు లేని ఓటర్లకు ఎంపికచేసిన 21 ఇతర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటింగ్‌కు అవకాశం ఉంటుంది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయి. అలాగే, ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించారు.