ఇంటికే కరోనా కిట్
ఐసొలేషన్లో ఉన్న వారికి సరఫరా
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
హైదరాబాద్: ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారిళ్ల వద్దకే ‘ఐసొలేషన్ కిట్’ను సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందజేయాలని ఆదేశించారు.
ఐసొలేషన్ అవస్థలను తప్పించడానికే..
కరోనా కేసులు ఉద్ధృతమవుతుండడంతో.. అంతే స్థాయిలో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నవారి (హోం ఐసొలేషన్) సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10వేల మందికి పైగా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో తొలుత ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. రెండు మూడు రోజులు గడిచే సరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు స్వల్ప స్థాయిలోనైనా బయటపడుతున్నాయి. కొందరిలో లక్షణాలతోనే కొవిడ్ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో తమ ఆరోగ్యంపై వారిలో ఆందోళన నెలకొంటోంది. ఏం మందులు వాడాలి? ఎలా వాడాలి? ఎవరిని సంప్రదించాలి? ఇటువంటి ఆలోచనలు భయాందోళనలను మరింత పెంచుతున్నాయి.ఎందుకంటే ఒక్కసారి పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత.. ఆ వ్యక్తి ఇంట్లోంచి బయటకు రావడానికి వీలుండదు. మరో మనిషి తోడు లేని పరిస్థితుల్లో మందుల కోసం బాధితుడే తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తోంది. ఇది సామాజిక వ్యాప్తికి కారణమవుతుందనే అవగాహన బాధితుల్లో ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పైగా ఆ మందులు సరైనవేనా? ఎంత మోతాదులో వాడాలనే పరిజ్ఞానం కూడా ఎక్కువమందిలో ఉండదు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకొనో, ఎవరైనా తెలిసినవారు చెప్పింది వినో వాటిని వాడాల్సి వస్తోంది. సరైన మార్గనిర్దేశం లేకుండా ఔషధాలు వాడటం వల్ల దుష్ఫలితాలు తలెత్తే ప్రమాదమూ పొంచి ఉంది. ఐసొలేషన్ బాధితులు అనుభవిస్తున్న ఈ అవస్థలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, వారి చేరువకే అవసరమైన ఔషధాలను అందించాలనే ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తాజాగా తీసుకొంది. 17 రోజుల పాటు ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా కిట్లో వస్తువులు, ఔషధాలను సమకూర్చనున్నారు.
పంపిణీ ఎలా?
మున్ముందు కేసుల తీవ్రత పెరుగుతుందనే ఆందోళన నెలకొనడంతో..భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. బాధితుడు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారనే సమాచారాన్ని వైద్యాధికారులు నిర్ధారించుకోగానే.. సమీప ప్రభుత్వ వైద్యశాల నుంచి కిట్లను నేరుగా వైద్యసిబ్బంది బాధితుని ఇంటికెళ్లి అందజేస్తుంది. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నా సరే.. బాధితులందరికీ కిట్లను ఇస్తారు. నిత్యం వైద్యసిబ్బంది ఫోన్ ద్వారా వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటుంది. ఇలా బాధితులకు ప్రభుత్వం బాసటగా నిలువనుంది.
కిట్లో ఏముంటాయి?
★శానిటైజర్లు, మాస్క్లు, గ్లౌజులు
★హైడ్రాక్సీక్లోరోక్విన్
★ పారాసెటమాల్
★యాంటీ బయాటిక్స్
★విటమిన్ సి, ఇ, డి3 తదితరాలు
★ లివోసెటిరిజైన్
★ ఎసిడిటీని తగ్గించే మాత్రలు
★ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని అవగాహన పెంపొందించే పుస్తకం