80లక్షల మంది అకౌంట్లలో రూ.15 వేలు జమ!

80లక్షల మంది అకౌంట్లలో రూ.15 వేలు జమ!అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ . జనవరి 9వ తేదీన సీఎం ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి సురేష్ ప్రకటించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకం వర్తించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ది చేకూరనున్నట్లు వెల్లడించారు. గత యేడాది 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.6,300కోట్లు జమ చేసినట్లు మంత్రి సురేష్ స్పష్టం చేశారు. ఈ సారి దాదాపు రెండు రెట్లు అధికంగా లబ్దిదారుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయబోతున్నారని ఆయన తెలిపారు. ఇక రేషన్ కార్డులు, అమ్మఒడి తొలగిస్తున్నామని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి కొట్టిపారేశారు. ఎన్ని లక్షల మంది అర్హులు వున్నా అందరికీ పథకాలను అందిస్తామని ఆయన ప్రకటించారు. తెల్లరేషన్ కార్డు కలిగి వుండి, ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే పిల్లలకు ఈ అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని అన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఏడాదికి విడతల వారీగా రూ.15వేలు ఆర్థిక సాయం అందచేయనున్నారని తెలిపారు. ఈ పథకం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ స్థాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ వర్తిస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు.