అమెరికాలో ఒమిక్రాన్ తొలి మరణం

అమెరికాలో ఒమిక్రాన్ తొలి మరణంవాషింగ్టన్ : అమెరికాలో ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది. టెక్సాస్ లోని హారిస్ కౌంటిలో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే సదరు వ్యక్తి ఇప్పటి వరకు టీకా తీసుకోలేదని తెలిపింది. అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఇంతకు అతను రెండు సార్లు కొవిడ్ బారినపడినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా కౌంటీ మెజిస్ట్రేట్ లీనా హిడ్గాలో కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఒకరు మృతి చెందారని , ఇదే ఒమిక్రాన్ కారణంగా నమోదైన తొలి మరణమని ట్వీట్ చేశారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ అమెరికాలో విజృంభిస్తున్నది. డిసెంబర్ 18తో పూర్తైన వీక్లీ సీక్వెన్సింగ్ డేటా ఆధారంగా అమెరికాలో కరోనా కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ వేరియంటే కారణమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షణ్ సోమవారం పేర్కొంది.

గత నెలాఖరులో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకు ప్రపంచదేశాలకు విస్తరిస్తున్నది. ఇంతకు ముందు బ్రిటన్ లో తొలి మరణం నమోదైంది. ఇప్పటివరకు 12 మంది మృత్యవాతపడ్డారు. 104 మంది వరకు ప్రస్తుతం ఆస్పత్రిలో చేరినట్లు బ్రిటన్ ఉపప్రధాని డొమినిక్ రాబ్ పేర్కొన్నారు.