ప్రతిరోజూ తాగునీటి సరఫరా

వచ్చే ఉగాది నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం
వరంగల్ కార్పొరేషన్​పై మంత్రి కేటీఆర్​ సమీక్షప్రతిరోజూ తాగునీటి సరఫరాహైద‌రాబాద్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజూ ప్ర‌తి ఇంటికీ మంచినీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో సోమవారం హైదరాబాద్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి పై ఉన్నతాధికారులతో స‌వివ‌రంగా సమీక్షించారు. నగర పరిధిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు అందించే లక్ష్యంగా పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ- అర్బన్ ద్వారా పెద్ద ఎత్తున నగరంలో తాగునీటి సరఫరాకు అవసరమైన మౌలిక వసతుల కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గతంలో కేవలం 30 ఎం ఎల్ డీల నీటి సరఫరా నగరానికి ఉంటే, ప్రస్తుతం 168 ఎం ఎల్ డీ లకి పెరిగిందన్నారు. దీంతో పాటు గతంలో 1400 కిలోమీటర్ల పైపులైన్లు ఉంటే దీనికి అదనంగా ఇప్పటికే 1400 కిలోమీటర్లు పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మరో 500 కిలోమీటర్ల పైప్ లైన్ల నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. నగరంలో నీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన 200 మంది నియామకానికి సంబంధించి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ వారి సహాయంతో వెంటనే రిక్రూట్ చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రతిరోజు మంచి నీరు అందించేందుకు మున్సిపల్​ శాఖ ఇంజినీరింగ్ ఈ ఎన్సీ మరియు ఇతర ఉన్నతాధికారులు ప్రతి వారం ఆయా పనుల పురోగతిని వరంగల్ వెళ్లి సమీక్షించాలని ఆదేశించారు. వరంగల్ నగరంలో సుమారు లక్షా 70 వేల గృహాలకు నల్లా కనెక్షన్లు ఉన్నాయన్నారు. మిగిలిన గృహాలకు కూడా సాధ్యమైనంత త్వరగా కలెక్షన్లు ఇచ్చేలా చూడాలన్నారు. కలెక్షన్లను ఒక రూపాయికి తీసుకునేలా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. నగర ప్రజాప్రతినిధులు ఇందుకు బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు. కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న సుమారు 3,700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పురోగతిని కేటీఆర్​ సమీక్షించారు. ఇప్పటికే దాదాపు 800 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మెజారిటీ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకునే దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ లు మంత్రులకు తెలియజేశారు. త్వరలోనే పూర్తయిన 800 ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని చేపడతామని మంత్రులు తెలిపారు. దీంతో పాటు నగర పరిధిలో జిల్లా కలెక్టరేట్ తో పాటు మోడల్ జూనియర్ కాలేజ్ వంటి మౌలిక వసతుల నిర్మాణాలు పూర్తయ్యాయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని , వీటిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన వైకుంఠ ధామాల నిర్మాణం, అర్బన్ పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి కార్యక్రమాలను కార్పొరేషన్ పరిధిలోనే కొనసాగించాలని సూచించారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం ప్రతి నెల కార్పొరేషన్ కి 7.33 కోట్ల రూపాయలను అందజేస్తుందన్నారు. ఇప్పటిదాకా సుమారు రూ. 81 కోట్ల రూపాయలను ప్రభుత్వం పట్టణ ప్రగతి నిధుల ద్వారా అందించిందని తెలిపారు. గతంలో సీఎం ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఇప్పటిదాకా 440 కి పైగా పనులు పూర్తి కావడం లేదా పురోగతిలో ఉన్న విషయాన్ని అధికారులు తెలిపారు.ప్రతిరోజూ తాగునీటి సరఫరాఈ సమావేశంలో వరంగల్ నగరంలో చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమాలతో పాటు చారిత్రక కట్టడాల పరిరక్షణ మరియు నగర పారిశుధ్యం, నగర రోడ్డు నెట్వర్క్ బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. త్వరలోనే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు. ‘వరంగల్ కార్పొరేషన్ కి ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు పెట్టి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నగరాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపించిందని సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు అని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతిరాథోడ్​లు’ అన్నారు. ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సూచనలకు అనుగుణంగా సమన్వయంతో ముందుకు పోతా మన్నారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో పుర‌పాల‌క‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్, ఆర్థిక‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ రామ‌కృష్ణారావు, జిల్లా క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, ప‌బ్లిక్ హెల్త్ ఈఎన్సీ శ్రీ‌ధ‌ర్, సీఈ ధ‌న్ సింగ్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.