ఐపీఎల్ 2022 సీజన్ ఎప్పుడో తెలుసా?

ఐపీఎల్ 2022 సీజన్ ఎప్పుడో తెలుసా?స్పోర్ట్స్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, ఈ యేడాది మార్చి 27 నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ టోర్నీని ఈసారి ఇండియాలోనే నిర్వహించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. అయితే మొత్తం 4 వేదికల్లో మ్యాచ్ లను నిర్వహించనున్నారు. వాంఖడే స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, డీవై పాటిల్ స్టేడియం, ఎంసీఏ స్టేడియాల్లో మ్యాచ్ లను నిర్వహించే అవకాశాలున్నాయి. నేడు ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ వర్చువల్ భేటీ నిర్వహించింది.

ఒకవేళ కొవిడ్ వల్ల ఇండియాలో టోర్నీ చేపట్టలేని పక్షంలో అప్పుడు యూఏఈకి వేదికలను మార్చే అవకాశాలున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ముంబయి, పూణేల్లో మ్యాచ్ లను నిర్వహించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణం అవసరం ఉండదని, బయోబబుల్ సమస్య రాదన్న ఉద్దేశంలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ కోసం ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరి 12, 13 తేదీలో యధావిధిగా కొనసాగించనున్నారు.