యూపీలో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్

యూపీలో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది. మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో తొమ్మిది మంది మంత్రుల భవిష్యత్ తేలనుంది. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 412 కంపెనీలకు చెందిన 50 వేల మంది కేంద్ర పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.

2017లో పశ్చిమ యూపీలోని ఈ 58 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 53, బీఎస్పీ 2, ఎస్పీ 2, ఆర్ ఎల్డీ 1 సీటును గెలుచుకున్నాయి. ఇక్కడ జాట్ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో వీరు ప్రధాన పాత్ర పోషించారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి గురువారం నుంచి మార్చి 7 మధ్య 7 విడుతల్లో పోలింగ్ జరుగనున్నది. మిగతా 4 రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ , గోవాలో 14న, పంజాబ్ లో 20న, మణిపూర్ లో ఈ నెల 27న, మార్చి 3న పోలింగ్ జరుగనున్నది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.