విదేశీ రాయబారుల​ బయోటెక్​ విజిట్

విదేశీ రాయబారుల​ బయోటెక్​ విజిట్హైదరాబాద్: దేశంలో వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన పారిశ్రామిక యూనిట్లైన భారత బయోటెక్ లిమిటెడ్ , బయోలాజికల్ సంస్థలను బుధవారం 64 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు సందర్శించారు. భారత్​ తీసుకుంటున్న కొన్ని కీలక పరిశోధన , అభివృద్ధి కార్యకలాపాలను విదేశీ రాయబారులు, హైకమిషనర్లకు తెలియజేయడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ పర్యటనను నిర్వహించింది. ఈ ఉన్నత స్థాయి బృందాన్ని రెండు బ్యాచ్ లుగా విభజించి మొదటి బ్యాచ్ ను భారత బయోటెక్ లిమిటెడ్ కు తీసుకెళ్లారు. రెండో బ్యాచ్ బయోలాజికల్ ఈ సంస్థ ను సందర్శించింది. అనంతరం ఈ బ్యాచ్ ను భారత బయోటెక్ లిమిటెడ్ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎస్​ సోమేష్ కుమార్ విదేశీ ప్రముఖులను ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్​ నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడిన అతితక్కువ సమయంలోనే దేశంలోనే అద్భుతమైన పురోగతి సాధించిందని అన్నారు. గత ఆరేళ్లలో దేశంలో సులభతర వ్యాపారం చేయడంలో రాష్ట్రం ముందున్నదని చెప్పారు. హైదరాబాద్ నగరం భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉండి విమాన , రోడ్డు రవాణా వ్యవస్థలతో అనుసంధానమై ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వల్ల అగ్రశ్రేణి సంస్థలైన గూగుల్, ఆపిల్, ఫేస్ బుక్, అమెజాన్, మైక్రోసాప్ట్ వంటి సంస్థలు అతి పెద్ద యూనిట్ల ను హైదరాబాద్ లో నెలకొల్పినట్లు వారికి వివరించారు. ఈ సంస్థలు యుఎస్ కు వెలుపల తమ అతిపెద్ద శాఖలను హైదరాబాద్ లో కలిగి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఫార్మా రంగం ఉత్పా దక విలువ సుమారు 50 బిలియన్ యుఎస్ డాలర్లు అని తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న టీకా ఉత్పత్తిలో 33 శాతం భారతదేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే హైదరాబాద్ టీకా కేంద్రంగా ఉందన్నారు. దానిని వంద బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు త్వరితగతిన ఆమోదం కోసం రాష్ట్రంలో కొత్త టీఎస్- ఐపాస్ విధానాన్ని రూపొందించిందని చెప్పారు. ఈ విధానం గేమ్ ఛేంజర్ అని నిరూపించబడిందని,విదేశీ రాయబారుల​ బయోటెక్​ విజిట్గత ఆరు సంవత్సరాలలో 14 వేల యూనిట్లు గ్రౌండింగ్ జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా పరిశ్రమల మరియు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ రాష్ట్రం పెట్టుబడి సామర్థ్యాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ (ఓ.ఆర్.ఆర్) కు సమీపంలో 500 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వినయ్ కుమార్, జీఏడీ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, మేడ్చల్ కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతి , బయోలాజికల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎస్​ మహిమ దాట్ల , భారత బయోటెక్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఎల్లా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.