సీబీఐ ఇన్​స్పెక్టర్​కు అత్యున్నత అవార్డు

సీబీఐ ఇన్​స్పెక్టర్​కు అత్యున్నత అవార్డుఢిల్లీ : తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్​స్పెక్టర్​ బీ సతీష్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూ ఢిల్లీలో బుధవారం సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ ఈ అవార్డును అందజేశారు. సతీష్ ప్రభు సీబీఐ లోనూ, గతంలో పని చేసిన ఆర్పీఎఫ్​ లోనూ అనేక సంచలన కేసులను చేధించి నిందితులకు శిక్ష పడేలా చేయడంతో ఆయనకు ఈ అవార్డు లభించింది. గతంలో సంచలనం సృష్టించిన అబూ సలేమ్ -మోనికా బేడి కేసును సీబీఐ విచారణాధికారిగా సతీష్ ప్రభు చేధించారు. ఇన్ కంట్యాక్స్ చీఫ్ కమిషనర్, సెంట్రల్ ఇన్ కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ భాగస్వాములపైన అవినీతి కేసులను సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. గౌతమి ఎక్స్ ప్రెస్ కుట్ర కేసును చేధించారు. అలాగే అంతర్రాష్ట్ర గంజాయి కేసుల్లో కూడా సమర్థవంతంగా పని చేసి పలు అవార్డులు అందుకున్నారు. సతీష్ ప్రభు చూపిన సమర్థతకు 2012లో ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ కూడా లభించింది. సతీష్ ప్రభును పలువురు సీబీఐ అధికారులు ఘనంగా సత్కరించారు. సత్కరించిన వారిలో సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తదితరులు ఉన్నారు.