న్యూఢిల్లీ: టీమిండీయా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికారు. పదిహేడేళ్ల వయస్సులోనే అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన ఆయన 18 సంవత్సరాల కెరీర్కు బుధవారం గుడ్బై చెప్పాడు. రిటైర్మెంట్ను ప్రకటిస్తూ ట్విట్టర్లో భావోద్వేగ పోస్టు పెట్టాడు. ఇంతకాలం తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని, ముఖ్యంగా తనపై నమ్మకముంచిన సౌరవ్ గంగూలీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ రాశాడు. ప్రతిభ పరంగా పార్థివ్ మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయినా.. ధోనీ హయాంలో ఆడాడు కాబట్టే భారతజట్టులో అవకాశాలు రాలేదని ఎందరో మాజీలు చాలాసార్లు అభిప్రాయం వ్యక్తపరిచారు. అయితే ధోనీ కన్నా మెరుగ్గా ఆడలేకపోయినందువల్లే చాన్స్ దక్కలేదని పార్థివ్ తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. 2002 ఆగస్టు 8న గంగూలీ సారథ్యంలో 17 ఏళ్ల వయస్సులోనే ఇంగ్లండ్పై పార్థివ్ టీమిండియాలో టెస్టు అరంగ్రేంటం చేశాడు. చివరగా 2018 జనవరిలో సౌతాఫ్రికాతో టెస్టు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో సెంచరీ చేయకపోయినా దేశవాళీ క్రికెట్లో దిగ్గజంగా పార్థివ్ పేరు తెచ్చుకున్నాడు. 194 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన పటేల్ 43 సగటు, 27 శతకాలతో 11,240 పరుగులు తీశాడు. ఐపీఎల్లోనూ దక్కన్ చార్జర్స్, ముంబై, చెన్నై , బెంగుళూరు తరపున 13 సీజన్లు ఆడాడు.