రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ కీలకనిర్ణయం

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రానికి ప్రతీ నెలా రూ.12వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయిందన్నారు. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన రూ.982 కోట్ల రూపాయలతో కలిపి కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదనే విషయాన్ని సీఎంకు వివరించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ కీలకనిర్ణయం

ఇక రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆశించన స్థాయిలో ఆదాయం పెరగలేదన్నారు. ఫలితంగా కొద్ది మొత్తంలోనే ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ వచ్చిన ఆదాయంతోనే అన్ని అవసరాలు తీరాలని, రాష్ట్రం ఏడాదికి 37,400 కోట్ల రూపాయలను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలని సీఎం ముందు వివరించారు. ఇవి ప్రతీ నెలా ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అప్పులను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదన్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లిస్తేనే మూడు వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని, దీంతో రాష్ట్ర ఖజానా పై భారం పడుతుందన్నారు. ఇక చెల్లింపుల్లో ఎటువంటి మార్పు చేసేది లేదని, ఏ పనీ చేసే వీలుండదు కనుక తగిన వ్యూహం అనుసరించాల్సిన అవసరం వుందని సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు. సమీక్ష అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ఈ క్రింది కీలక నిర్ణయాలు తీసుకున్నది.

– అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి
– ఆసరా పెన్షన్లను యధావిధిగా అందించాలి.
– లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని మే నెలలో కూడా అందించాలి.
– లాక్ డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతుంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నుంచి కొనసాగదు.
– ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి.
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత కొనసాగుతుంది