పెట్రో ధరల పెంపుపై మోడీకి కేటీఆర్ రీట్వీట్ 

పెట్రో ధరల పెంపుపై మోడీకి కేటీఆర్ రీట్వీట్

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : భారత దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలపై ట్వీట్లను ప్రధాని మోడీ గుర్తు చేసుకోవాలని సూచించారు. 2014కు ముందు ప్రధాని మోడీ చేసిన ట్వీట్లను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. పెట్రో ధరల పెంపు విషయంలో యూపీఏ ప్రభుత్వాన్ని మోడీ ప్రశ్నించిన ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.పెట్రో ధరల పెంపుపై మోడీకి కేటీఆర్ రీట్వీట్ యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచడంతో కోట్లాది మందిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాడు ప్రధాని మోడీ తన ట్వీట్ లో వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మోడీ చేసిన మరో ట్వీట్ ను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు.కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల రాష్ట్రాలపై తీవ్ర భారం పడుతుందని కేటీఆర్ మండిపడ్డారు. పేదల అవసరాల పట్ల బాధ్యత లేకుండా బీజేపీ పాలిస్తోందన్నారు.

బీజేపీ అధికారం కోసం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చామని బీజేపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్రం వాటా ఎంత ఉందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జీరో సహకారం అందించి ప్రచారం చేసుకోవడం ప్రధాని స్థాయికి తగదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.