హైదరాబాద్ : డెస్క్, ఫోటో, వీడియో జర్నలిస్టులనే తేడాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే జర్నలిస్టులకు మొదటిసారి ప్రత్యేక నిధిని పెట్టి, ఆదుకుంటున్న ప్రభుత్వం కూడా ఒక్క కెసిఆర్ దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మధ్యే బ్రెయిన్ స్ట్రోక్ తో హఠాన్మరణం పొందిన ఈనాడు పత్రిక సీనియర్ ఫోటో జర్నలిస్టు రాజమౌళి కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. హైదరాబాద్ “మల్కాజీగిరిలోని వారి నివాసానికి వెళ్ళిన మంత్రి ఎర్రబెల్లి రాజమౌళి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మరణానికి దారి తీసిన పరిస్థితులను అడిగారు. రాజమౌళితో తనకున్న అనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు. రాజమౌళి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. జనం కోసం పాటు పడే జర్నలిస్టులు వారి వ్యక్తిగత జీవితం, సొంత కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని మంత్రి తెలిపారు. పిల్లల భవిష్యత్తు గురించి కొంత సమయం కేటాయించాలని సూచించారు. ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆలోచిస్తున్నదన్నారు. అయితే, రాజమౌళి నిరాడంబర జీవి అని, తనకు చాలా కాలంగా రాజమౌళి తెలుసన్నారు. రాజమౌళి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.