రాజన్న సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

రాజన్న సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలురాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా జరిగాయి. కొవిడ్- 19 రూల్స్ మేరకు అంతరంగింకంగానే ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రాత:కాల పూజల అనంతరం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని, శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభస్వామి వారిని అందంగా అలంకరించబడ్డ పల్లకిలో, పెద్దసేవలో కూర్చుండబెట్టి ఆలయం చుట్టూ వేద పండితుల వేద మంత్రోచ్ఛరణాల మధ్య మూడు ప్రదక్షిణలు గావించారు. ఆలయ వేదపండితులు, అర్చకుల వేద పనసలతో రాజన్న ఆలయం మారుమోగింది.

అనంతరం ఉత్సవమూర్తులతో ఉత్తరద్వారం గుండా వెళ్తున్న క్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. అనంతరం ఆలయం ముందు భాగంలో ఆలయ వేదపండితులు, అర్చకులు ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం గురించి చక్కగా భక్తులకు వివరించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఏఈఓ బ్రహ్మన్నగారి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు గుండి మూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, దేవాలయానికి సంబంధించిన కొందరు సిబ్బంది పాల్గొన్నారు.