మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా

మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి వందే భారత్ రైలు రాక మరింత ఆలస్యం కానుంది. జనవరి 19న సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రధాని మోడీ, రైలుకు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఐతే ప్రధాని హైదరాబాద్ పర్యటన వాయిదా పడటంతో ఈ అత్యాధునిక రైలు ప్రారంభంపై సందిగ్ధత ఏర్పడినట్లైంది. మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడినట్లు ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం అందించింది. ప్రధాని పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెల్పింది.

షెడ్యూల్ ప్రకారం మోడీ ఈ నెల 19న హైదరాబాద్ కు రావాల్సి ఉంది. వందే భారత్ రైలుతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించాల్సి ఉంది. అదే విధంగా సికింద్రాబాద్-విజయవాడ మధ్య రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఐతే మోడీ పర్యటన అర్ధాంతరంగా రద్దుకావడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.