రైల్లోంచి దూకిన ప్రేమజంట..ప్రియురాలు మృతి

రైల్లోంచి దూకిన ప్రేమజంట..ప్రియురాలు మృతిరైల్లోంచి దూకిన ప్రేమజంట..ప్రియురాలు మృతి

వరంగల్ టైమ్స్, తమిళనాడు : తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెన్నైకి చెందిన ఓ ప్రేమజంట అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమికులిద్దరూ చెన్నై బీచ్ నుండి తాంబరం వరకు రైల్లో బయల్దేరారు. మార్గం మధ్యలో ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని రైల్లోంచి కిందకు దూకేశారు. ఈ ఘటనతో ప్రియురాలు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తాంబరం చెన్నై కోస్టల్ లైన్ చెన్నై శివారు ప్రాంతాలను, చెన్నైని కలిపే అత్యంత ముఖ్యమైన రైలు మార్గం. ఈ మార్గంలో ప్రతీరోజూ వందలాది రైళ్లు నడుస్తాయి. ముఖ్యంగా చెన్నై, చెన్నై సబర్బ్‌లకు ఎలక్ట్రిక్ రైళ్లు నడపబడుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 8:30 గంటలకు చెన్నై బీచ్ నుండి తాంబరం వైపు ఎలక్ట్రిక్ రైలు బయలుదేరింది. ఇంతలోనే ఓ ప్రేమ జంట కౌగిలించుకుని రైలు ముందుకు దూకింది. తలకు బలంగా తగలడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రియుడు తీవ్ర గాయాలతో రక్తమోడుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడు.

గమనించిన కో పైలట్‌ వెంటనే రైలు ఆపేశాడు. సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని రక్షించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనను గమనించిన ప్రయాణికులను పోలీసులు విచారించారు.

ఇద్దరి సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ఇద్దరి సెల్‌ఫోన్లు పగిలిపోవడంతో విచారణ కష్టంగా మారింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువకుడి పేరు ఇళంగో అని ప్రాథమిక విచారణలో తేలింది. మృతురాలికి 20 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమికుల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.