ఇక పాతపద్ధతిలోనే

ఇక పాతపద్ధతిలోనేహైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లో భాగంగా చేపట్టిన స్లాట్ బుకింగ్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21నుంచి పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు జరుపనున్నట్లు వెల్లడించింది. అయితే కార్డ్‌ (సీఏఆర్‌డీ) విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్లాట్‌ బుక్ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.ఈనెల 11 న స్లాట్ బుకింగ్ ప్రారంభంకాగా 14 నుంచి రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాతపద్దతిలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లప్రక్రియ జరగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పాతపద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆధార్, కులం, కుటుంబసభ్యుల వివరాలు, సామాజిక హోదా తదితరాలను తొలగిస్తూ మాన్యువల్ ను సవరించేదాకా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ , ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (పీటీఐఎన్ ) నమోదును ఆపాలని హైకోర్టు ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే.