వర్మ సినిమా ‘మర్డర్’ పాట విడుదల

వర్మ సినిమా 'మర్డర్' పాట విడుదలహైదరాబాద్: పిల్లల్ని ప్రేమించడం తప్పా…? అంటూ సాగే ‘మర్డర్’ (కుటుంబ కథా చిత్రం) చిత్రం పాటను మంగళవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ లో రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. ఆ మధ్య జరిగిన ఒక సంచలన యదార్ధ ప్రేమ హత్య ఉదంతాన్ని ఆధారం చేసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తొలి ట్రైలర్ గత మంగళవారం విడుదలై నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉందని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలిపారు. దాదాపు 70 లక్షల మంది ఈ ట్రైలర్ ను చూశారని, ఒక ఫ్యామిలీ చిత్రంలా ఎంతో బావుందన్న ప్రశంసలు ప్రేక్షకుల నుంచి లభించాయని వారు వెల్లడించారు. త్వరలో మరో ట్రైలర్ ను, రెండో పాటను విడుదల చేస్తామని వారు తెలిపారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని వారు వివరించారు. ఆగస్ట్ నెలలో సినిమా తొలికాపీ సిద్ధమవుతుంది. ఆదే నెలలో సెన్సార్ కు పంపుతాం అని నిర్మాతలు వెల్లడించారు.

ఈ చిత్రానికి డిఓపి: జగదీష్, సంగీతం: డిఎస్ఆర్.