రూ. 23లక్షల కోట్లు ఏమయ్యాయి? : రాహుల్ గాంధీ

రూ. 23లక్షల కోట్లు ఏమయ్యాయి? : రాహుల్ గాంధీ
కేంద్రంపై రాహుల్‌ గాంధీ విమర్శలు
జీడీపీ వృద్ధి అంటే గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచడమా?

రూ. 23లక్షల కోట్లు ఏమయ్యాయి? : రాహుల్ గాంధీ

 

ఢిల్లీ : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌తో పాటు వంట గ్యాస్‌ ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతుండటంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలతో రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, వేతన జీవులు, చిన్న-మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి దిగజారిపోతోందని, మోడీకి చెందిన నలుగురైదుగురు మిత్రులకు మాత్రమే లాభం చేకూరుతోందని దుయ్యబట్టారు.

కేంద్ర ప్రభుత్వం జీడీపీకి కొత్త భావనను ముందుకు తీసుకొస్తోందని బుధవారం మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. జీడీపీ పెరుగుదల అంటే ఈ ప్రభుత్వం గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచడమని అనుకుంటోందంటూ ఎద్దేవా చేశారు. వీటి ధరలను పెంచడం ద్వారా గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.23లక్షల కోట్లు అర్జించిందన్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోందో దేశ ప్రజలు ప్రశ్నించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.

అక్కడ ధరలు తగ్గుతుంటే భారత్‌లో ఎందుకు పెరుగుతున్నాయ్‌?
2014లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎల్‌పీజీ వంట గ్యాస్‌ ధర రూ.410లు ఉంటే.. ఇప్పుడు అది రూ.885కి పెరిగిపోయిందన్నారు. అలాగే, అప్పట్లో రూ.71.5లుగా ఉన్న లీటరు పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.101లకు చేరిందన్నారు. రూ.57లుగా ఉన్న డీజిల్‌ ధర కూడా ప్రస్తుతం రూ.88కి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

2014 నుంచి అంతర్జాతీయంగా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు తగ్గుతున్నా భారత్‌లో మాత్రం పెరిగిపోతున్నాయన్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం భారతదేశ ఆస్తులు, సంస్థలను అమ్మేస్తోందన్నారు. పెట్రోల్‌ ధరల పెంపుతో మనందరిపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రధాని మోదీ డీమానిటైజేషన్‌ అన్నారనీ.. ఇప్పుడేమో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ మానిటైజేషన్‌ అంటున్నారన్నారు.