ఏపీఎస్సీ పారామిలటరీ ఫోర్స్‌లాంటిది

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ గౌతం స‌వాంగ్
మైక్రోఫైనాన్స్‌ యాప్స్‌‌పై ప్రత్యేక దృష్టి
ఏపీఎస్సీ పారామిలటరీ ఫోర్స్‌లాంటిదిగుంటూరు ‌: ఏపీఎస్పీ అనేది ఒక పారామిలటరీ ఫోర్స్​లాంటిదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ‘గత సంవత్సరంలో కష్టపడి పనిచేసిన ఏపీఎస్పీ సిబ్బందిని ప్రోత్సహించేందుకు అవార్డులు ఇచ్చాము. డీజీపీ డిస్క్ అనేది కొత్త అవార్డు. విధుల నిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డు. ఏపీఎస్పీ ఫోర్స్ స్వాతంత్ర్యం ముందు నుంచి ఉంది. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏపీఎస్పీ పనిచేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో కూడా సేవలందించిన చరిత్ర ఏపీఎస్పీకి ఉంది. పోలీసులకు, సెక్యూరిటీలకు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీఎస్పీ సేవలు ఉన్నచోట పరిస్ధితులు త్వరగా అదుపులోకి వస్తాయి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్స్‌కు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీ సెక్యూరిటి వింగ్ దేశానికే ప్రామాణికం. ఎస్డీఆర్ఎఫ్ కూడా ఏపీఎస్పీలో ఒక భాగమే. ఏపీ పోలీస్ దేశంలోనే ఒక అత్యుత్తమ పోలీస్ ఫోర్స్‌గా గుర్తించబడింది. అవసరమైన అన్ని వనరులు లేకపోయినా ఏపీ పోలీస్ పనిచేస్తోంది. బాధ్యత, పారదర్శకత, ప్రతిభ ప్రదర్శిస్తూ ఏపీ పోలీసులు ప్రతి నిత్యం పనిచేస్తున్నారు’ అని డీజీపీ గౌతం సవాంగ్​ అన్నారు. సీఎం జగన్ ​పోలీస్ సర్వీసులను ఉత్తమంగా తయారు చేయడానికి అవసరమైన వనరులు ఇస్తున్నారు. పోలీసు వ్యవస్ధలో వచ్చిన మార్పులతో సామాన్య ప్రజలకు సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. సామాన్య మానవుడికి పోలీసుల ప్రాధాన్యత తెలియాలి. స్పందన ద్వారా ప్రజలు పోలీసులకు నేరుగా పిటిషన్లు పెట్టుకోవచ్చు. వీటికి సీఎం కార్యాలయం వరకూ పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. స్పందనలో వచ్చే పిటిషన్లలో 52 శాతం మహిళలు ఉన్నాయని వారి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దిశ పోలీసులు బాధ్యతగా పని చేస్తున్నారని అన్నారు. దిశా ఎస్‌ఓఎస్ యాప్‌ని ప్రతి మహిళా డౌన్‌లోడ్ చేసుకోవాలని యాప్ ఆన్‌లో ఉంచి మూడుసార్లు ఫోన్ షేక్ చేస్తే వీడియోతో సహా దగ్గరలోని పోలీస్ స్టేషన్​కు సమాచారం వెళుతుందని తెలిపారు. పోలీస్ సేవా యాప్ ద్వారా ఇప్పటి వరకు 1.05లక్షలకు పైగా ఎఫ్ఐఆర్‌లు డౌన్‌లోడ్ చేశారని పేర్కొన్నారు. ఏపీ పోలీసులకు గత సంవత్సర కాలంలో 108 అవార్డులు వచ్చాయని ఐసీజేఎస్‌లో దేశంలోనే రెండవ స్ధానం ఏపీ పోలీస్ సాధించిందని చెప్పారు. రాబోయే రోజుల్లో పోలీసులు ‘మేం ఉన్నాం, మీకోసమే ఉన్నాం’అనే నమ్మకం బలహీనవర్గాలకు ఇవ్వాలన్నారు. వ్యక్తిగతంగా, అందరం దేశానికే గర్వకారణం అయ్యేలా పనిచేయాలని సూచించారు. మైక్రోఫైనాన్స్ పై ప్రత్యేక‌ దృష్టి పెడతామన్నారు. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల‌నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయని మొబైల్ లోన్ యాప్‌లపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తామని చెప్పారు. బాధితులు ధైర్యంగా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలన్నారు. నోయిడా, ఢిల్లీ, గురుగావ్‌ల నుంచి ఎక్కువగా ఈ యాప్‌ల నిర్వ‌హ‌ణ జరుగుతున్నట్టు గుర్తించాం. మొబైల్ లోన్ యాప్‌ల మూలాలను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ అన్నారు.