పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ పీజీ -2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా/ డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలని సూచించింది. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులను ఈ నెల 15 ఉదయం 8 గంటల నుంచి 22 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు.

అభ్యర్థులు నిర్ధేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. ప్రవేశాలకు సంబంధించి తదితర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.