శ్రీశైలం వెళ్లే భక్తులకు స్పర్శ దర్శనం టిక్కెట్లు

శ్రీశైలం వెళ్లే భక్తులకు స్పర్శ దర్శనం టిక్కెట్లు

వరంగల్ టైమ్స్, శ్రీశైలం : శ్రీశైలం వెళ్లే యాత్రికులు బస్సు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే స్పర్శ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంతో పాటు, పొరుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలకూ ప్రత్యేక సర్వీసులు నడిపేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.

‘బస్సుల్లో తిరుపతి వెళ్లే భక్తులకు శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్లు అందుబాటులో ఉంచినట్లే.. శ్రీశైలం విషయంలోనూ ఈ విధానాన్ని తెస్తున్నాం. పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం ఇకపై వివిధ ప్యాకేజీలు తీసుకొస్తాం. భక్తులకు రాత్రి వేళల్లో వసతి కల్పించడంతో పాటు..టూరిస్ట్ గైడ్లనూ అందుబాటులో ఉంచుతాం’ అని వివరించారు.

ఫేస్ బుక్ అభ్యర్థనకు ఆర్టీసీ స్పందన
కృష్ణా జిల్లా పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లకు వెళ్లడానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని వెంకట్రావు అనే వ్యక్తి ఇటీవల ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డిని ఫేస్ బుక్ ద్వారా కోరారు. స్పందించిన ఆయన రాత్రి 8 గంటలకు 40 మంది ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూశారు.