వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా: అవార్డులు సాధించిన దేశంలోని టాప్ 10 అత్యుత్తమ గ్రామాలలో తెలంగాణకు చెందినవే ఏడు గ్రామాలు కావడం గర్వించదగిన విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం 58 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో 25 ఎకరాలలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
గతంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పోతే పదింటిలో తొమ్మిది ఉమ్మడి జిల్లాలు బ్యాక్వర్డ్ కింద రాసి ఉండే. వాటిని ఈ రోజు రివర్స్ చేసి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పంచాయతీ రాజ్ అధికారులు, సిబ్బంది కృషి వల్ల, గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతి సూచికల ఫలితాలు తీస్తే, దేశంలో పది గ్రామాలకు అవార్డులు వస్తే పదింటిలో ఏడు గ్రామాలు తెలంగాణయే ఉన్నాయి. యావత్ దేశం మీద 28 రాష్ట్రాలు, మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాల లెక్కలు తీస్తే.. మొదటి నెంబర్ టెన్ డెవలప్మెంట్ అయిన గ్రామాల్లో 7 గ్రామాలు తెలంగాణకు చెందినవి కావడం గర్వించదగిన విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. దీనికి కృషిచేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును, అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు. పంచాయతీరాజ్ సిస్టమ్లో భాగంగా పనిచేస్తున్న జడ్పీ ఛైర్మన్లు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచులు అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నానన్నారు సీఎం కేసఆర్. రాష్ట్ర సీఎంగా, రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా నేను కోరుకునేది ఏం ఉంటది. నాకు ఇంతకన్న గొప్ప ఏం ఉంటది. ఎంత గర్వంగా.. తలెత్తుకొని చెప్పుకోగలుగుతాం అని అన్నారు.