హైదరాబాద్ : టూరిస్టులుగా రాష్ట్రానికి వస్తున్న ఫ్లవరిస్టులు అవగాహన లేమితో ఫూలిష్ గా మాట్లాడటం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మధ్య వలస పక్షుల్లా రాష్ట్రానికి వరుసగా వస్తున్న కొందరు బీజేపీ నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. స్థానిక బీజేపీ నేతలు ఇచ్చిన ప్రాంప్టింగ్ ని తూచా తప్పకుండా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, వరంగల్ కి వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాటలు చూస్తే, వారి తెలివి బయట పడుతుందన్నారు.
* మా సీఎం ప్రజలతో కలిసి ఉంటారు..
మీరు సీఎంగా సామాన్య ప్రజల్ని కలవడానికి ప్రత్యేకంగా సమయం ఇస్తారు. కానీ మా సీఎం సామాన్య ప్రజలతో కలిసి ఉంటారు అన్న విషయం మీకు తెలుసా? అని అస్సాం సీఎంని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పటికే లక్షా 32వేల ఉద్యోగాలిచ్చాం. ఉద్యోగ ఖాళీలను నింపుతున్నాం. మరి మీ రాష్ట్రంలో ఇంకా ప్రణాళికల దగ్గరే ఉన్నారు. సరే, దేశంలో ప్రతీ సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలేమయ్యాయి? చెప్పగలరా? 2014లో ఇచ్చిన ఆ హామీ ప్రకారం ఇప్పటి వరకు 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి? అవేమయ్యాయి? ఉద్యోగాల కల్పనలో విఫలమైంది ఎవరు? మీరా? మేమా? అని అస్సాం సీఎంని మంత్రి ఎర్రబెల్లి సూటిగా ప్రశ్నించారు.
* మా పథకాలు కాపీ కొట్టి, మమ్మల్నే విమర్శిస్తారా?..
దేశంలో ఎక్కడైనా తెలంగాణలో అమలవుతున్న పథకాలు అమలవుతున్నాయా? మీ హయాంలో దేశంలో ఎక్కడైనా కాళేశ్వరం వంటి ప్రాజెక్టుని కట్టారా? రైతులకు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు మీ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ పథకం అమలు చేస్తున్నదెవరు? మీ జల్ శక్తి మిషన్ పథకం, మా మిషన్ భగీరథకు కాపీ కాదా? ఒకవైపు మా పథకాలను కాపీ కొడతారు. నిండు పార్లమెంటులోనే అభినందించి అవార్డులు, రివార్డులు ఇస్తారు. ఇక్కడకు వచ్చి మీరేం చేశారని ప్రశ్నిస్తారా? ఇదేనా మీ బీజేపీ సంస్కృతి? అంటూ మంత్రి ఎర్రబెల్లి బీజేపీ నేతల వైఖరిని ఎండగట్టారు.
* అభివృద్ధిపై ఎలాంటి చర్చకైనా సిద్ధం
సీఎం కేసీఆర్ దార్శనికత వల్ల తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. బీజేపీ నేతలు సహా, ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి రావొచ్చు, పోవచ్చు. మీటింగులు పెట్టుకోవచ్చు కానీ, మా సీఎం కేసీఆర్ మీద మాట్లాడటానికి సాహసించవద్దు. అయితే, గియితే, ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. మీ రాష్ట్రాలు, దేశంలోని వివిధ పథకాలు, మా తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు, వాటి అమలు తీరుపై, అభివృద్ధి, సంక్షేమాలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.