ఇంద్ర‌కీలాద్రిపై మ‌రో అప‌చారం

ఇంద్ర‌కీలాద్రిపై మ‌రో అప‌చారం

వరంగల్ టైమ్స్, ఇంద్ర‌కీలాద్రి : ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై మ‌రో అప‌చారం చోటుచేసుకుంది. ఇటీవ‌ల ఒక మ‌హిళా భ‌క్తురాలు కొండ‌పైకి ద‌ర్శ‌నానికి వ‌చ్చి గ‌ర్భ‌గుడిలోని అమ్మ‌వారి మూల‌విరాట్‌ను సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసిన ఘ‌ట‌న మరువ‌క‌ముందే మ‌రో అప‌చారం జరిగింది. ఇంద్ర‌కీలాద్రిపై న‌ట‌రాజ స్వామి ఆల‌యం వెనుక ఉన్న సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి ఆల‌యంలోని బ‌లిహార‌ణ పీఠంపై అన‌ధికార అర్చ‌కుడు ఎంగిలి నీళ్లు పోసాడు. బ‌లిహార‌ణ పీఠంపై ఎంగిలి నీళ్లు పోయ‌డాన్ని గ‌మ‌నించిన భక్తులు అతన్ని ప్రశ్నించారు. అయితే తనను ప్ర‌శ్నించిన భ‌క్తులపై ఆ అనధికార అర్చకుడు దురుసుగా మాట్లాడుతూ అది త‌ప్పు కాదంటూ బుకాయించాడు. దీంతో వారు ఈఓ భ్ర‌మ‌రాంబ‌కు ఫిర్యాదు చేశారు. ఇద్దరినీ పిలిపించి ఈఓ విచార‌ణ చేయ‌గా వారు అస‌లు ఆల‌యానికి సంబంధం లేని వ్య‌క్తులుగా ఈఓ గుర్తించింది.

ఇంద్ర‌కీలాద్రిపై మ‌రో అప‌చారం

సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి ఆల‌యంలో వాస్తవంగా విధులు నిర్వ‌హించాల్సిన అర్చ‌కుడు గ‌ణేష్.. తాను మృత్యుంజ‌య హోమంలో పాల్గొన‌డానికి వెళుతూ కృష్ణా జిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌మిడిముక్క‌ల మండ‌లం వీరంకిలాకులు ప్రాంతానికి చెందిన క‌నుపూరి సుబ్ర‌హ్మ‌ణ్యంను విధుల్లో పెట్టారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం దగ్గర ఉన్న నాగేంద్రస్వామి ఆలయంలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఆలయానికి సంబంధంలేని యనమంద్ర కృష్ణ కిషోర్ అనే వ్య‌క్తిని కూడా గుర్తించి తీవ్రంగా హెచ్చ‌రించి చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఫిర్యాదు చేసిన భ‌క్తుల‌కు హామీ ఇస్తూ, అనధికార వ్యక్తులతో పాటు ఆలయ ఉద్యోగి గణేష్ నుంచి వివరణ పత్రం వ్రాయించుకున్నారు. విధులు ఎవ‌రు నిర్వ‌హిస్తున్నారు.. ఎవ‌రికి ఎవ‌రు డ్యూటీ వేస్తున్నార‌నే దానిపై నివేదిక ఇవ్వాల‌ని, వైదిక క‌మిటీ లిస్టును కూడా ఇవ్వాల‌ని అధికారుల‌ను ఈఓ భ్రమరాంభ ఆదేశించారు.