అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు

అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులువరంగల్ టైమ్స్, ఉత్తరప్రదేశ్ : ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కారుపై దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా, ఛాజర్సీ టోల్ గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. 3 – 4 తూటాలు దూసుకెళ్లాయని చెప్పారు. “యూపీ మేరఠ్ లోని కిథౌర్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ బయల్దేరాను. ఛాజర్సీ టోల్ గేట్ వద్ద నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3- 4 రౌండ్లు తూటాలు దూసుకెళ్లాయి. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు, నలుగురు వ్యక్తులు ఉన్నారు” అని ఏఎన్ఐ వార్తా సంస్థతో అసదుద్దీన్ చెప్పారు.

అయితే కాల్పుల ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత ప్రధాని మోడీ, యూపీ ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలుస్తానని ఎంఐఎం అధినేత వెల్లడించారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిని అరెస్ట్ చేశామని పోలీసులు తనకు చెప్పినట్లు ఓవైసీ పేర్కొన్నారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.