విద్యుత్ పొదుపుపై చైతన్యం రావాలి

విద్యుత్ పొదుపుపై చైతన్యం రావాలిహైదరాబాద్​: విద్యుత్ ను పొదుపు చేయడంలో ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా ఆర్థిక వెసులుబాటు తో పాటు పర్యావరణ పరిరక్షణ సులభతరమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రేనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఆయన జూమ్ కెమెరా ద్వారా ప్రారంభించారు. అదే విధంగా ఆ సంస్థ రూపొందించిన సావనీర్ ను ఆయన ఆవిష్కరించారు. ఇప్పటి వరకు థర్మల్ విద్యుత్ మీద ఆధారపడిన ప్రపంచం ఇప్పుడిప్పుడే సాంప్రదేయతర విద్యుత్ వైపు చూస్తుందన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ముందున్నదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్​ ఈ విషయంలో చాలా ముందు ఉన్నారన్నారు. ఉద్యమ కాలం లోనే విద్యుత్ పొదుపుపై సీఎం కేసీఆర్ చెప్పే హితబోధను మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందు ఉన్న ఛాలెంజ్ విద్యుత్ పొదుపు అని అందుకు అనుసరించాల్సిన పద్ధతులను ప్రజల్లోకి ఉద్యమంలా తీసుకు పోవాలని ఆయన కోరారు. 2014 కు ముందు మొక్కలు నాటడం అంటే అటవీశాఖ కు మాత్రమే పరిమితమై ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో సాధించిన తెలంగాణలో ఏర్పడ్డ ప్రభుత్వం మొక్కలు నాటడం సామాజిక బాధ్యత గా మార్చారని ఆయన గుర్తుచేశారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పడ్డ శ్రమ అని ఆయన కొనియాడారు. విద్యుత్ వినియోగం మానవ జీవితంలో భాగమైందని అటువంటి విద్యుత్ వాడకంలో పొదుపు పాటిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ పొదుపు విషయంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, రెడ్కో వంటి సంస్థ లు చొరవ చూపి పని చేస్తున్నాయని ఇది ప్రజా ఉద్యమంలా ముందుకు పోతే లక్ష్యసిద్ధి సుసాధ్యం కష్ట తరం కాబోదని విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. ఐఇఐ చైర్మన్ రామేశ్వర్ రావు కో ఆర్డినెట్ చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖా కార్యదర్శి సందీప్ సుల్తానీయ, రెడ్కో చైర్మన్ ఎన్ జానయ్య , ఎనర్జీ కన్సర్వేషన్ చైర్మన్ ఇ. శ్రీనివాస చారి, కన్వీనర్ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.